
అమరావతి, ఫిబ్రవరి 5:- సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాల అధ్యక్షులు కృషి చేయాలని సూచించారు. గురువారం అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ‘నీరు–ప్రగతి, జల హారతి – సాగునీటి సంఘాల భాగస్వామ్యం’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను సమర్థ పాలన, స్పష్టమైన ప్రణాళికలతో రైతు అనుకూల రాష్ట్రంగా మార్చామని తెలిపారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో కరువు అనే మాటే వినిపించని స్థితి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే పునాది అని గుర్తు చేశారు. హంద్రీనీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల వల్లే నేడు అనంతపురం జిల్లా పండ్ల తోటల వనంగా మారిందన్నారు. మైక్రో ఇరిగేషన్కు 90 శాతం సబ్సిడీ ఇచ్చి హార్టికల్చర్ను ప్రోత్సహించామని తెలిపారు.
సాగునీటి సంఘాల పనితీరును సీఎం ప్రశంసించారు. 1997లో దేశంలోనే తొలిసారిగా సాగునీటి సంఘాల వ్యవస్థను ప్రవేశపెట్టామని, వాటి ద్వారా 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు నిర్మించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి సంఘాల బిల్లులను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసిందన్నారు.Amaravathi news
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.344 కోట్లతో 7,197 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు రైతు సంఘాల ద్వారా చేపట్టామని తెలిపారు. నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.
నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందించడమే నిజమైన జల హారతి అని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్కు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం పూర్తయ్యాక నదుల అనుసంధానం చేపడతామని తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టును ఎన్జీటీ నిలిపివేసిందని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం సీమలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, కె. అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.










