పల్నాడు జిల్లా, చిలకలూరిపేట
సేవాతత్పరతతో ముందుకుసాగుతున్న అసిస్ట్ సంస్థ చిలకలూరిపేటలో ఉండటం చుట్టుపక్కల నియోజకవర్గాలకే గర్వకారణమని, సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే అసిస్ట్ లాంటి సేవా సంస్థలు రాష్ట్రాభివృద్ధికి కూడా తగిన చేయూత అందించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం అసిస్ట్ సంస్థ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ డైరెక్టర్ జాష్టి రంగారావు దంపతులను సన్మానించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ సమాజంలోని అన్నివర్గాలకు ఉపయోగపడే అసిస్ట్ సంస్థ 30వేల నిరుపేద కుటుంబాలకు ఆర్థికసాయం చేయడం, సుమారు 73 వేల మంది 6-14 ఏళ్ల వయసున్న బాలకార్మికులకు విద్యను అందించడం, 14వేల మంది యువతకు ఉపాధి శిక్షణ కల్పించడం, దాదాపు 92వేల బోర్ల ద్వారా 17వేల ఎకరాలకు సాగునీరు కల్పించడం వంటి ఎన్నో గొప్పపనులు సంస్థ పూర్తిచేసిందన్నారు. అదే విధంగా 4 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించడంతో పాటు, 18వేలకు పైగా కుటుంబాలకు వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేసిన ఘనత అసిస్ట్ సంస్థకే దక్కిందన్నారు.
పేదల హృదయాల్లో అసిస్ట్ సంస్థ సుస్థిరస్థానం సంపాదించుకుందని, సంస్థ నిర్వాహకులు రంగారావు ఇటీవలే అమెరికన్ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారని, అసిస్ట్, ఏ.ఎం.జీ సంస్థలు చిలకలూరిపేటలో ఉండటం నిజంగా ఎంతో గర్వకారణమని పుల్లారావు స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో కూడా అసిస్ట్ సంస్థ ప్రజలకు వంటకు అవసరమైన వస్తువులు అందించిందని, ఇతర దేశాల నుంచి నిధులు తీసుకొచ్చి, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్న రంగారావు దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నానన్నారు. అసిస్ట్ సంస్థ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వాహకులతో పాటు, సంస్థలో పనిచేసే ప్రతిఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్టు పుల్లారావు చెప్పారు.