
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామ సర్పంచుల పదవీకాలం మరో వారం రోజుల్లో (ఏప్రిల్ 2తో) ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు ముందు నిధుల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు సర్పంచుల ఆర్థిక అధికారాలపై ఆంక్షలు విధించింది. బుధవారం నుంచి సర్పంచులు నేరుగా ఎలాంటి చెల్లింపులు చేయడానికి వీలులేదని, కేవలం జీతాల వంటి అత్యవసర ఖర్చులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో సర్పంచ్ థంబ్ వేయగానే నేరుగా ట్రెజరీకి వెళ్లే బిల్లులు, ఇకపై డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (DDO) లాగిన్కు వెళ్తాయి. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిధుల విడుదల జరుగుతుంది.
అధికారులకు కఠిన హెచ్చరికలు
రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జిల్లా పంచాయతీ అధికారులతో (DPO) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా కార్యదర్శులు సర్పంచులతో కుమ్మక్కై నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో పదవీకాలం ముగిసే ముందు చెక్ పవర్ రద్దు చేసే విధానం ఉండగా, ప్రస్తుతం CFMS ద్వారా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
సిద్ధమవుతున్న ప్రత్యేక అధికారుల జాబితా
వచ్చే నెల 3వ తేదీ నుంచి పంచాయతీల పాలనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారుల (Special Officers) నియామక ప్రక్రియ వేగవంతమైంది. మండల స్థాయిలోని తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఇంజనీరింగ్ శాఖ అధికారులకు పనుల కొలతలు (M-Book) చూసే బాధ్యత ఉండటం వల్ల వారిని ఈ నియామకాలకు దూరంగా ఉంచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,069 గ్రామ పంచాయతీల్లో పాలనాపరమైన ఇబ్బందులు కలగకుండా, కొన్నిచోట్ల ఇద్దరు మూడు పంచాయతీలకు కలిపి ఒకే అధికారిని నియమించే అవకాశం ఉంది.http://AMARAVATHI NEWS







