
గుంటూరు, సెప్టెంబర్ 18 : సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా(A.Thameem Ansariya) తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని,ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని
కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా ఆరోగ్య సంబంధిత సమస్యలు, అంటు వ్యాధులు, అతిసార, డెంగ్యూ, మలేరియా వంటి ఏ సమస్య ఉన్నా, అనుమానాలు ఉన్నా తక్షణం కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. మరగకాచి చల్లార్చిన మంచినీటిని మాత్రమే త్రాగాలని పిలుపునిచ్చారు. ఏవైనా అనారోగ్య లక్షణాలను గుర్తించిన
వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని అన్నారు. వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, సురక్షితం లేనివిధంగా విక్రయిస్తున్న ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోరాదని తెలిపారు. వ్యాధులు పట్ల ముఖ్యంగా అంటువ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైద్య అధికారులు, జిల్లా యంత్రాంగం అందిస్తున్న సూచనలు, సలహాలు పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.






