
Tirupathi:శ్రీకాళహస్తి, అక్టోబర్ 23 :-శ్రీకాళహస్తీశ్వరాలయంలో అభిషేక టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచడం పట్ల భక్తుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రతి భక్తుడు స్వామి అభిషేక సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ – “శివుడు అభిషేక ప్రియుడు అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్ర కార్తీక మాసంలో అభిషేక సేవకు పరిమితులు విధించడం భక్తులకు నిరాశ కలిగిస్తోంది,” అని అన్నారు. ప్రస్తుతం ఒక్కో కాలానికి కేవలం ఇరవై టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచడం, ఆఫ్లైన్ కౌంటర్లో టికెట్లు లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
“ఆన్లైన్ విధానం గురించి చాలామందికి అవగాహన లేదు. ప్రచారం కూడా తక్కువగా ఉండటంతో భక్తులు క్యూల్లో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ సేవలను ఆన్లైన్లోకి మార్చినప్పుడు కోటికి పైగా నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన కౌంటర్లు ఎందుకు అవసరం? అని ప్రశ్నించారు.ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను పునఃసమీక్షించి, భక్తుల సంతృప్తి దిశగా చర్యలు తీసుకోవాలని అంజూరు శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. గతంలో వాయు లింగేశ్వరునికి నాలుగు కాలాల్లో అభిషేకాలు నిర్వహించేవారని, ఇప్పుడు మూడవ కాల అభిషేకాన్ని కూడా పునరుద్ధరించి ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు మార్గాల ద్వారా టికెట్లు జారీ చేయాలని సూచించారు.”ప్రతిరోజూ కౌంటర్ల వద్ద భక్తులు ఆఫ్లైన్ టికెట్లు లభించక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కార్తీక సోమవారం లోపు చర్యలు తీసుకొని, ప్రతి భక్తుడు స్వామివారి కృపకు నోచుకునేలా చూడాలి,” అని ఆయన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కోరారు.







