బాపట్ల, సెప్టెంబర్ 20:
సూర్యలంక బీచ్ ఫెస్టివల్ను బాపట్ల జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం రాత్రి జిల్లా కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎండీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న బీచ్ ఫెస్టివల్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రారంభించనుండగా, 27న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో, ఒక కిలోమీటర్ తీరం పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
భారీ ఏర్పాట్లు – లక్షలాది సందర్శకుల కోసం సిద్ధం
మొదటి రోజు రెండు లక్షల మంది పర్యాటకులు హాజరయ్యేలా అన్ని విభాగాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పేరలి కెనాల్ నుంచి కొత్త మార్గం ఏర్పాటుపై అధికారులు సమీక్షించనున్నారు.
80 ఫుడ్ కోర్టుల ఏర్పాటు, 10-15 వేల కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ, నాణ్యమైన ఆహార పదార్థాలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ వంటి అంశాల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ కోర్టుల వద్ద అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
లేజర్ షో, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణ
పర్యాటకులను ఆకట్టుకునే విధంగా లేజర్ షోను ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించనున్నారు. పారా గ్లైడింగ్, కయాకింగ్, స్పీడ్ బోట్, ఫోర్ వీలర్ రైడ్స్ తదితర అడ్వెంచర్ క్రీడలు కూడా వేడుకల్లో భాగంగా ఉండనున్నాయి. వీటి వివరాలు, ఆటల టైమ్ టేబుల్ను ప్రచార బోర్డుల రూపంలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
వేడుకల పూర్తివేళ గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మెరైన్ పోలీసులు, అగ్నిమాపక శాఖ భద్రత బాధ్యతలు వహించనున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల కోసం సెక్టార్ ఇంచార్జులను ప్రతి 250 మీటర్లకు నియమించనున్నారు.
పాస్ లు, బాధ్యతలు – స్పష్టతతో పనిచేయాలి
విధి నిర్వహణలో ఉన్న అధికారులకు పరిమిత పాస్లు, డ్యూటీ పాస్లు, వాహన పాస్లను మంజూరు చేయాలని పేర్కొన్నారు. హెలిప్యాడ్ బాధ్యత చీరాల ఆర్డీఓకు అప్పగించగా, ప్రధాన వేదిక బాధ్యత బాపట్ల ఆర్డీఓకు అప్పగించారు. ఆటల పోటీల నిర్వహణకు జడ్పీ సీఈఓ బాధ్యత వహించనున్నారు.
రోజువారీ సమీక్షలు, క్షేత్ర పర్యటనలు
వేడుకల పూర్తి సమీక్ష కోసం ప్రతి రోజూ క్షేత్ర పరిశీలనతోపాటు కలెక్టరేట్లో సమీక్ష, వీక్షణ సమావేశాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, ఉప కలెక్టర్ సాయిబాబా, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.