KRISHNA NEWS: మే నెల 2 వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటన
మే నెల 2 వ తేదీన భారత ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఉదయం గన్నవరం విమానాశ్రయంలోని సమావేశ గదిలో జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే మే నెల 2 వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం సందర్భంగా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటు పాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానమంత్రి తో పాటు పలువురు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు గన్నవరం విమానాశ్రయానికి రానున్నారన్నారు. జిల్లాలో వారు పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రోటోకాల్ ప్రకారం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలన్నారు. అన్ని నిర్దేశిత ప్రాంతాలలోనూ మంచినీటి ఏర్పాట్లు చేయాలన్నారు. కంట్రోల్ విభాగము అంతర్జాలం కనెక్షన్తో ఏర్పాటు చేసి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. అత్యంత ప్రముఖులు, ప్రముఖులు విమానాశ్రయానికి వస్తున్నందున విమానాలు బుక్ చేసుకున్న ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత తొందరగా ముందుగానే విమానాశ్రయం చేరుకునే విధంగా వారికి ఈమెయిల్ , వాట్సాప్ , ట్విట్టర్, ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం అందజేయాలన్నారు. వచ్చే ప్రముఖులకు రవాణా, వసతి ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. బ్లూ పుస్తకం ప్రకారం తాత్కాలిక ప్రధానమంత్రి కార్యాలయ సెటప్ ను ఎస్పీజీ వారు వచ్చాక వారితో చర్చించి ఏర్పాటు చేయాలన్నారు. ఏ జిల్లా అధికారి ఏ విధులు నిర్వహించాలో త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని వారు వారి పరిధిలోని సిబ్బందికి కూడా విధులు కేటాయిస్తూ ఆ ఉత్తర్వుల ప్రతులను కలెక్టరేట్కు సమాచారం నిమిత్తం పంపాలన్నారు. విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందికి పాసులు జారీ చేసే ఏర్పాట్లు కూడా చేయాలన్నారు.