PALNADU NEWS: పోలవరం, అమరావతి నిర్మాణంతో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నదే చంద్రబాబు లక్ష్యం : మాజీ మంత్రి ప్రత్తిపాటి
CM BIRTHDAY IN PALNADU
ఐదేళ్లపాటు రైతుల్ని వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన గత పాలకుల వైఖరికి పూర్తి భిన్నంగా కూటమిప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని, వ్యవసాయం పండగ కావాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి జన్మదినం సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డ్ లో మాజీమంత్రి ప్రత్తిపాటి, ఎంపీ కృష్ణ దేవరాయలుతో కలిసి రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేశారు. ప్రజలకు, రాష్ట్రానికి ఏది అవసరమో, ఎలాంటి ఆలోచనలు భవిష్యత్ ను ఇస్తాయో ముందే 20 నుంచి 30 ఏళ్ల ముందే ఊహించగల గొప్ప దార్శనికుడు చంద్రబాబునాయుడని, అలాంటి వ్యక్తి నేడు మనకు నాయకుడిగా ఉండటం మనందరం గర్వించాల్సిన విషయమని ప్రత్తిపాటి తెలిపారు. ఎన్ని సంక్షోభాలు, సవాళ్లు ఎదురైనా వాటిని తట్టుకొని పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబునాయుడన్నారు. ఆయన 45 సంవత్సరాల సుదీర్థ రాజకీయ జీవితంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారని, సవాళ్లను ఢీకొన్నారని ప్రత్తిపాటి చెప్పారు. హైదరబాద్ భవిష్యత్ ను ముందే ఊహించి, ఐటీ రంగంతో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అదే మాదిరి ఇప్పుడు అమరావతి నిర్మాణం,.. తద్వారా రాష్ట్ర భవిష్యత్ పై ఆలోచన చేస్తున్నారన్నారు.