గుంటూరు

Guntur: జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు,12 జూన్ 2025 :- జిల్లాలో గత సంవత్సర కాలంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలను సమన్వం చేస్తూ  ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సహకారంతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

శుక్రవారం  కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ హాలులో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, నగరపాలక సంస్థ మేయరు కోవెలమూడి రవీంద్ర, శాసనసభ్యులు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి , నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు తో కలసి జిల్లాలో, నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన  వివిధ అభివృధ్ది పనుల స్థితిగతులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు. అమృత్ రైల్వేస్టేషన్ల పనుల పురోగతి, శంకర్ విలాస్ ఆర్వోబీ, పెనుమాక వద్ద ఆర్ యూ బీ, గుంటూరు నగరపాలక సంస్థలో పలు అభివృద్ది పనులు, శానిటేషన్, గుంటూరు ఛానల్ విస్తరణ తదితర పనులపై  కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకొని సూచనలు జారీ చేశారు. ఈ సంధర్భంగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో అమృత స్టేషన్లు క్రింద మంజూరైన గుంటూరు, తెనాలి, మంగళగిరి పనులు వేగవంతం చేయటంతో పాటు, మూడు వంతెనల వద్ద డ్రైనేజీ పనులు, మంగళగిరి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఆర్ యూ బీ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచించారు. శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నందున విద్యుత్ స్థంబాలు పక్కకు మార్చే పనులకు నగరపాలక సంస్థ అధికారులను సమన్వయం చేసుకుంటూ రీ ఎస్టీమేషన్లు సిద్ధం చేసి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఆర్వోబీ పిల్లర్స్ వారంలో ప్రారంభించేందుకు వీలుగా ట్రాఫిక్ ను మళ్ళింపుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్థంబాలను తక్షణమే పక్కకు మార్చాలన్నారు. ఆర్వోబీ ట్రాఫిక్ మళ్ళింపుకు గుర్తించిన రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. మూడవ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు సీఆర్డీఏ అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు ప్రారంభించేలా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ ను మరింతగా మెరుగుపర్చేలా శాసనసభ్యులను సమన్వయం చేసుకుంటూ నగరపాలక సంస్థ కమిషనర్ , మేయరు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ విధుల్లో అలసత్వం వహించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.  నల్లపాడు వాటర్ ట్యాంకు స్థలం, వల్లూరి వారితోటలోని కార్మిక శాఖ స్థలం అభివృద్ధి నిమిత్తం నగరపాలక సంస్థ కు అప్పగించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో కమర్షియల్ గార్బేజీ తరలింపు ఏజెన్సీల ఎంపికను వెంటనే పూర్తి చేయాలన్నారు. నార్ల అడిటోరియం పెండింగ్ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.మనససరోవరం స్థలం అభివృద్ధికి ముందుకు వచ్చే ఏజెన్సీలను గుర్తించాలని, పీవీకే నాయుడు మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అమృత్ 2 ద్వారా మంజూరైన త్రాగునీటి పైపు లైను  టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించటానికి చర్యలు తీసుకోవాలని, గోరంట్ల మంచినీటి ట్యాంకు పెండింగ్ పనులు పూర్తి చేసి పూర్తి సామర్ధ్యంతో నీటి సరఫరా చేయాలన్నారు.  రైతులకు అతి ముఖ్యమైన  గుంటూరు ఛానల్ విస్తరణకు పనులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రజల నుంచే వచ్చే ఫిర్యాధుల పరిష్కారం లో సంతృప్తి స్థాయి మరింతగా మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులలో వివిధ దశలకు నిర్దేశించిన సమయానికి వాటిని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వ పాలన  ప్రారంభించిన సంవత్సరం కాలంలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, కొన్ని పూర్తి చేసామని, మరికొన్ని పనులు మంజూరై వివిధ దశల్లో ఉన్నాయన్నారు.   ఆయా పనులు ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయ్యాయి, ఏదైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాలపై శాసనసభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించటం జరిగిందన్నారు. అందులో ముందుగా శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు, శాఖాపరమైన సమస్యలు తదితరాలపై చర్చించామని, ఆర్ఓబి  నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్, విద్యుత్ స్తంభాల మార్పిడి వగైరాల గురించి ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ, జిఎంసి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే శారదా కాలనీ, నెహ్రు నగర్ రహదారుల విస్తరణ పనులు, , కంకరగుంట ఆర్ యూ బీ వద్ద మరమ్మత్తు పనులు పూర్తి చేశామన్నారు. మరో వారం పది రోజుల్లో శంకర్ విలాస్ ఆర్వోబీ పిల్లర్ల పనులు ప్రారంభమవుతాయన్నారు. 3 వంతెనల ఆర్ యూ బి వద్ద డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలపై రైల్వే, జిఎంసి ఉన్నతాధికారులతోను సమీక్షించి సూచనలు జారీ చేశామన్నారు. నగరపాలక సంస్థలో శానిటేషన్ మరింతగా మెరుగు పర్చేందుకు కార్పొరేషన్ అధికారులు, శాసనసభ్యులు, డివిజన్ కార్పోరేటర్లు ఎవరి పరిధిలో వాళ్ళు స్థాయికి మించి పనులు నిర్వహిస్తున్నారు. అయినా కొన్ని కొన్నిచోట్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉన్నాయని, వాటిని కూడ పూర్తి స్థాయిలో పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమృత్ 2.0 పథకం కింద ప్రారంభించిన పనులు త్వరలో టెండర్ దశకు వెళ్లబోతున్నాయని, గోరంట్ల వాటర్ ట్యాంక్ సెంట్రింగ్ పనులు 2-3 నెలల్లో పూర్తి చేసే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. వల్లూరివారితోటలో కార్మికశాఖ స్థలం, నల్లపాడులో వాటర్ ట్యాంకు , నార్ని వెంకటేశ్వరరావు ఆడిటోరియం పనులు కూడా పురోగతి దిశగా నడుస్తున్నాయన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి  భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభించేలా చర్చించటం జరిగిందన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి మరింతగా పెంచేలా పిర్యాదుల పరిష్కారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించి సూచనలు అందించామన్నారు. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం ప్రయాణికులు మరణించటం చాలా భాధకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన నాయుడుకు చర్యలు తీసుకునే సమర్ధత ఉందన్నారు.

         శాసనసబ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ నిరంతరం పర్యవేక్షణలో జిల్లాలో  గత సంవత్సర కాలంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజా క్షేత్రంలో విజయవంతంగా అమలు చేసి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు.

         శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరకాలం పాలనలో సూపర్ సిక్స్ హామీలను దాదాపు 90 శాతంకు పైగా అమలు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పదిహేను రోజులకు ఒకసారి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహించటం జరుగుతుందన్నారు. శంకర్ విలాస్ అర్వోబీ తో పాటు, వివిధ రహదారుల విస్తరణ, ఇతర దీర్ఘాకాలిక సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న కూటమి ప్రభుత్వ పాలన గోల్డెన్ టైమ్ వంటిందన్నారు.

         శాసనసభ్యులు గళ్ళా మాధవి మాట్లాడుతూ జిల్లాలోని అభివృద్ది కార్యక్రమాలతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి అధికారులతో  నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. నగరంలో శానిటేషన్ మరింత మెరుగు పర్చేందుకు అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి చేపట్టాల్సిన పనులపై కార్యచరణ ప్రణాళికను రూపొందించటం జరిగిందన్నారు. ప్రజప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అధికారులు సమన్వయం, సమిష్టి కృషితో అభివృద్ది పనులు , సమస్యలను నూరు శాతం పరిష్కరం చేసి ప్రజలకు మంచి ప్రభుత్వ పాలనను అందించటం జరుగుతుందన్నారు.

                                 సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డీప్యూటీ మేయరు సజీలా, అర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, నగరపాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, పంచాయితీ రాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఎస్ఈ డి శ్రీనివాస్,  జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణశ్రీ, రైల్వే డివిజన్ డీప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎంఆర్ నోయల్, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, ట్రాఫిక్ సీఐ అశోక్ , , ఆర్డీఓ శ్రీనివాసరావు, విద్యుత్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

—————————————————————————-

Authors

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button