
వేటపాలెం (బాపట్ల జిల్లా): బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అదుపుతప్పింది. గ్రామంలోని చాలా వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి, దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది కనీసం 15 రోజులకో, లేక నెలకు ఒకసారో మాత్రమే వచ్చి తూతూమంత్రంగా పారిశుధ్య పనులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం చెత్తను తొలగించకపోవడంతో ఇళ్ల ముందు, ప్రధాన రహదారులపై చెత్త గుట్టలుగా పేరుకుపోయి రోగాల బారిన పడే ప్రమాదం నెలకొందిCHIRALA NEWS:పది విద్యార్థులకు శక్తి బృందం దిశానిర్దేశం.
ముఖ్యంగా పాఠశాలల సమీపంలో మరియు రద్దీగా ఉండే బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజ్ రోడ్డు, రామకృష్ణ థియేటర్ రోడ్డు, పోలేరమ్మ గుడి రోడ్డు, చుండూరు లంప రోడ్డు, యానాది కాలనీ రోడ్డు, ఎస్బీహెచ్ రోడ్డు వంటి ప్రధాన వీధుల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పారిశుధ్య లోపానికి పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. పారిశుధ్యంపై కనీస దృష్టి సారించకుండా, పంచాయతీ వ్యవస్థను అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, గ్రామంలో పారిశుధ్య పనులు నిత్యం సక్రమంగా జరిగేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.







