
విజయవాడ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. నెం.15ను 14-11-2025న విడుదల చేసి, మార్చి 31ను తుది గడువుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నెలలు గడుస్తున్నా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడం పట్ల దివ్యాంగుల వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అర్హులైన దివ్యాంగుల కోసం మూడు సంవత్సరాల తరువాత బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్కు ఆదేశాలు వచ్చినప్పటికీ, రోస్టర్ వెరిఫికేషన్ సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతోందని దివ్యాంగులు వాపోతున్నారు.
వయస్సు పరిమితి దాటిపోతున్న అభ్యర్థులు ఇప్పటికే అవకాశాలు కోల్పోతూ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితిలో అధికారుల ఆలస్యం మరింత ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.Vijayawada Localnews
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న కృష్ణా జిల్లాలో సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి రోస్టర్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విజయవాడలో దివ్యాంగుల మహోద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.






