
విశాఖపట్నం, మార్చి 23: పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులను అధికారులు అత్యంత వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన గడువులోగా సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరటనివ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా డీఎంహెచ్ఓ, అటవీ శాఖలు తమ పరిధిలోని పెండింగ్ అంశాలను తక్షణమే క్లియర్ చేయాలని, పద్మనాభం మండల ఎంఆర్ఓ పరిధిలోని సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ విభాగం, పంచాయతీరాజ్, హౌసింగ్, రెవెన్యూ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కలెక్టర్ కఠినంగా వ్యవహరించారు. 21 రోజులు గడువు దాటినా ఫిర్యాదును పరిష్కరించని ఆనందపురం మండల సర్వేయర్కు నోటీసు జారీ చేయాలని, పదేపదే తప్పిదాలు చేసే అధికారులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్య మూలాలను తెలుసుకోవాలని సూచించారు.

253 వినతుల నమోదు: ఈ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 253 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 96, రెవెన్యూ శాఖకు 91, పోలీస్ శాఖకు 13, ఇతర శాఖలకు 53 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్ఛార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణి తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు వినతులను స్వీకరించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టారు.http://VISHAKAPATNAM NEWS







