
నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వస్తువుల నాణ్యతలో లోపాలు ఉన్నప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు.

ముఖ్యంగా ప్రస్తుత ఆన్లైన్ ట్రెండ్లో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పిస్తే వారు సమాజంలో మార్పు తీసుకురాగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సరఫరా అధికారి ఎం.వి. ప్రసాద్ గ్యాస్ సిలిండర్ల తూకం, సరఫరాపై జాగ్రత్తలు వివరించగా, ఆహార భద్రత మరియు తూనికల శాఖ అధికారులు ఆహార నాణ్యతను గుర్తించే పద్ధతులను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అనంతరం వినియోగదారుల హక్కులపై రూపొందించిన గోడ పత్రికలను, కరపత్రాలను అధికారులు విడుదల చేశారు.http://PALNADU NEWS







