
https://citymarriagebureau.com/ : ప్రతి అనుబంధం ఒక అందమైన ప్రయాణం. మీ అభిరుచులకు, కుటుంబ సంప్రదాయాలకు తగిన సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మా వెబ్సైట్ మీకు ఉత్తమ వేదిక. వేలాది నమ్మకమైన ప్రొఫైల్స్, సురక్షితమైన సేవలతో మీ పెళ్లి కలను సాకారం చేసుకోండి.
అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థ వీఐటీ-ఏపీ (VIT-AP) విశ్వవిద్యాలయం కీలక అడుగు వేసింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)తో కలిసి ‘స్మార్ట్ సస్టైనబుల్ క్యాంపస్ ఇనిషియేటివ్’కు శ్రీకారం చుట్టింది. అమరావతి క్యాంపస్లో మార్చి 10 నుంచి 14 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ – 2026’ సందర్భంగా ఈ కీలక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. పి. అరుళ్మౌళివర్మన్ మాట్లాడుతూ, EESL సహకారంతో వీఐటీ-ఏపీని 100 శాతం కార్బన్ ఫ్రీ (కర్బన ఉద్గార రహిత) క్యాంపస్గా మార్చడమే తమ ప్రథమ లక్ష్యమన్నారు. సమాజానికి తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. క్యాంపస్లో చదువుతున్న దాదాపు 20,000 మంది విద్యార్థులను ‘క్లైమేట్ యాక్షన్ ఛాంపియన్స్’గా తీర్చిదిద్దుతామని, తద్వారా వాతావరణ మార్పుల నివారణలో వారు జాతీయ స్థాయిలో చురుకైన పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
EESL మద్దతుతో వీఐటీ-ఏపీలో ఐదు ప్రధాన కార్యక్రమాలను చేపట్టనున్నారు. స్మార్ట్ మీటర్లు, ఏఐ (AI), ఐఓటీ (IoT) టెక్నాలజీతో క్యాంపస్ను పూర్తి స్థాయి స్మార్ట్ ఎనర్జీ క్యాంపస్గా అభివృద్ధి చేయడం, ఎల్ఈడీ (LED) లైటింగ్, రూఫ్టాప్ సోలార్, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ మరియు వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ఇందులో ముఖ్యమైనవి. అలాగే, స్మార్ట్ గ్రిడ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ బిల్డింగ్స్పై పరిశోధనలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను స్థాపించనున్నారు. విద్యార్థులకు ఎనర్జీ ఆడిట్ ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్ల ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పించడంతో పాటు వర్క్షాప్లు, ఈవీ (EV) ఛార్జింగ్ మౌలిక వసతులు, స్వచ్ఛ మొబిలిటీపై ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన EESL నేషనల్ అడ్వైజర్ ఏ. చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతతో ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో వీఐటీ-ఏపీ నిర్ణయం ఎంతో కీలకమన్నారు. EESL సీఈఓ అఖిలేష్ కుమార్ దీక్షిత్ పంపిన ప్రత్యేక సందేశాన్ని ఆయన సభలో వినిపించారు. వాతావరణ మార్పులపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జాతీయ ఎల్ఈడీ వీధిదీపాల (SLNP) ప్రాజెక్టు అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోందని కొనియాడారు.
ఇటీవల జరిగిన ఇండియా ఎనర్జీ వీక్-2026లో భారత్ సాధించిన 321.39 బిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు, 321.06 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి గణాంకాలను అంతర్జాతీయ నిపుణులు సైతం ప్రశంసించారని ఆయన గుర్తుచేశారు. 2028 నాటికి ఏపీని అత్యంత శక్తి సమర్థ రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ కన్వీనర్ డా. వై.వి. పవన్ కుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రాజెక్టుల వివరాలను, ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా. జయరామన్ కె. అయ్యర్, ఎఫిట్రానిక్స్ సిస్టమ్స్ సీఈఓ దాసరి రామకృష్ణ, యూఎస్ఏ ఎంబెడెడ్-గురు డైరెక్టర్ హరీష్ జనకిరామన్, అలాగే వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా. జగదీశ్ చంద్ర, డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) డా. ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.







