Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Vishaka patnam:శారీరక- మానసిక ఆరోగ్యానికి మార్గం యోగా

Press Release

శారీరక- మానసిక ఆరోగ్యానికి మార్గం యోగా

ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు

ఒలంపిక్, కామన్ వెల్త్ క్రీడల్లో యోగాను ప్రవేశపెట్టేలా ప్రధాని చొరవ చూపాలి

22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేపట్టి గిన్నిస్ రికార్డు సృష్టించారు

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని విశాఖలో జరుపుకోవడం ఏపీకి దక్కిన గౌరవం

ఇకపై యోగా మన జీవన విధానం కావాలి

యోగా డే గ్రాండ్ సక్సెస్.. సత్తా చాటారు

విశాఖలో నిర్వహించిన యోగాడేలో సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం, జూన్ 21: యోగా సాధన మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “”దేశం, ప్రాంతం, మతం, భాషతో సంబంధం లేకుండా యోగాకు ఆమోదం లభించింది. శరీరం, మనస్సు, ఆత్మలను కలిపేందుకు యోగానే మార్గం. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఒత్తిడిని అధిగమించవచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే ఆత్మవిశ్వాసం పెంచుకోవడం.. మానసిక ప్రశాంతతకు యోగా ఉపకరిస్తుంది. యోగా హింసను తగ్గిస్తుంది. శాంతిని ప్రోత్సహిస్తుంది. ఏఐతో సహా టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యోగా మరింత విస్తృతమైంది.” అని అన్నారు.

ప్రధాని మోదీతోనే యోగాకు గుర్తింపు

యోగా అంతర్జాతీయ స్థాయికి చేరడానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని చంద్రబాబు గుర్తు చేశారు. “యోగాకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రధాని మోదీ యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు. మోదీ చొరవతో మన భారతదేశ సంస్కృతి అయిన యోగాను 175కు పైగా దేశాలలో, 12 లక్షల ప్రదేశాలలో, 10 కోట్ల మందికి పైగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు.” అని చంద్రబాబు అన్నారు.

యోగాంధ్ర – ఒక చారిత్రక విజయం

ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కల్పించి, విశాఖకు వచ్చి యోగా డేలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొంది, ఏపీలో ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర ప్రచారాన్ని నిర్వహించాం. దీంట్లో భాగంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చి, 1.40 లక్షలకు పైగా ప్రాంతాల్లో 2.17 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు చేపట్టాం. విశాఖపట్నంలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశాం. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం మనకు గర్వకారణం.” అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఒలింపిక్స్ లో యోగాను చేర్చేలా ప్రధాని చొరవ చూపాలి

“యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా.. వివిధ దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారు. సెప్టెంబర్‌లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం కానుండడం ఆనందంగా ఉంది. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడలలో చేర్చేలా ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి దార్శనికత, గత పదేళ్లుగా యోగాను ప్రోత్సహించడం వల్ల, యోగా ఇప్పుడు ఉద్యమంగా మారింది. చరిత్ర సృష్టించాలన్నా.. రికార్డులు బ్రేక్ చేయాలన్నా ప్రధాని మోదీకే సాధ్యం. యోగా మన జీవితంలో భాగం కావాలి. ప్రజలు ప్రతిరోజూ ఒక గంట యోగా కోసం సమయం కేటాయించాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్షణ, సృజనాత్మకత వంటి అంశాలు పెంచుకోవడం చాలా అవసరం. దీనికి యోగా ఉపకరిస్తుంది. వ్యాయామంగానే కాకుండా.. ఓ శక్తివంతమైన సాధనంగా యోగాను ఆచరిద్దాం.” అని ముఖ్యమంత్రి అన్నారు.

విజన్ స్వర్ణ ఆంధ్ర @ 2047 & వన్ ఎర్త్ – వన్ హెల్త్

యోగా వల్ల సంతోషకరమైన సమాజం ఏర్పడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా “విజన్ స్వర్ణ ఆంధ్ర @ 2047 ప్రణాళికను అనుసరించి అభివృద్ధి, సంక్షేమాలను సాధించడంతో పాటు హెల్తీ వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడమే లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రొత్సాహం వల్లే యోగా, ప్రకృతి చికిత్స, ఆయుర్వేదం, గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛ భారత్, ప్రకృతి వ్యవసాయం వంటి వాటి పునరుద్దరణ సాధ్యమైంది. మోదీ విజన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడడానికి మార్గం సుగమమైంది. వన్ ఎర్త్ – వన్ హెల్త్ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏపీలో నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల గురించి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఇక్కడికి వచ్చిన వారితో పాటు.. యోగాడేలో పాల్గొన్న వారంతా చారిత్రాత్మకమైన కార్యక్రమంలో పాల్గొన్నట్టే. తెలుగు ప్రజలు 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలా యోగా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని ఆచరించి, జీవన విధానంగా మార్చుకుని అందర్లో చైతన్యం తీసుకువస్తూ…తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలంకారీ శాలువాతో సన్మానించి.. లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను అందచేశారు.


Vishaka patnam:శారీరక- మానసిక ఆరోగ్యానికి మార్గం యోగా

Author

  • Vishaka patnam:శారీరక- మానసిక ఆరోగ్యానికి మార్గం యోగా

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button