
నెల్లూరు, అక్టోబర్ 10 :–రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాలే మూలస్తంభాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోర్టులు, ఎయిర్ పోర్టులతో పాటు పర్యావరణ హిత పరిశ్రమలు, పశు సంరక్షణ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రగతికి మార్గదర్శకమవుతున్నాయని తెలిపారు.
వెంకటాచలం మండలం ఈదగాలిలో విశ్వసముద్ర గ్రూప్ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇథనాల్ ప్లాంట్, నంద గోకులం లైఫ్ స్కూల్, సేవ్ ద బుల్, పవర్ ఆఫ్ బుల్ వంటి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన సీఎం, అనంతరం సభలో మాట్లాడారు.
పోర్టులు-ఎయిర్ పోర్టులతో అభివృద్ధి వైపు రాష్ట్రం
“నెల్లూరు జిల్లా రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారుతోంది. కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం వంటి పోర్టులతో పాటు, దగదర్తి విమానాశ్రయం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకూ విస్తృత ప్రాధాన్యం ఇస్తున్నాం. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో 150 టీఎంసీల నీటి నిల్వను భద్రపరుస్తాం,” అని చంద్రబాబు వెల్లడించారు.
పర్యావరణ హితంగా పరిశ్రమలు – రైతులకు లాభం
విశ్వసముద్ర బయో ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసిన ఇథనాల్ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఉత్పత్తి చేస్తోంది. పాడైన బియ్యం, పంట వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణానికి హానికరం కాకుండా ఇంధనం తయారీ జరుగుతోందని సీఎం చెప్పారు. “రైతులకు ఆదాయం, పరిశ్రమలకు మద్దతు.. రెండింటి మేళవింపుతో అభివృద్ధి సాధ్యం,” అన్నారు.
పశుసంపద సంరక్షణ – విద్యుత్తు ఉత్పత్తిలో నూతన ప్రక్రియ
ఒంగోలు జాతి గోవులను సంరక్షించే గోశాలను ప్రారంభించిన సీఎం, “పవర్ ఆఫ్ బుల్” పథకంలో పశువుల శక్తిని వినియోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసే విధానాన్ని అభినందించారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 5 కిలోవాట్లను ఇన్ హౌస్ అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు.
విద్య కోసం ‘నంద గోకులం లైఫ్ స్కూల్’
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభ గల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన నంద గోకులం లైఫ్ స్కూల్ రాష్ట్రానికి ఓ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. “పీఎఫ్ఓర్ (P4) అనే విధానంలో డబ్బులే కాదు.. చేయూత ఇవ్వడమే ముఖ్యమన్న భావనను విశ్వసముద్ర చూపిస్తోంది,” అన్నారు.
భవిష్యత్ లో భారీ పెట్టుబడులు – విశాఖలో గూగుల్ డేటా సెంటర్
రాష్ట్రానికి వచ్చే దశల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని, విశాఖలో రూ.88 వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. “2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఆ దిశగా మన యువతిని సిద్ధం చేస్తున్నాం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు.










