అమరావతి: 07-10-25: రాష్ట్ర పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభమైన మూడు రోజుల వర్క్షాప్కి మంత్రి హాజరై, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ వర్క్షాప్లో రాష్ట్రంలోని మొత్తం 77 మున్సిపాల్టీల నుండి అధికారులు విడివిడిగా హాజరుకానుండగా, మొదటి రోజు 29 మున్సిపాల్టీల అధికారులు సమావేశమయ్యారు. 2029 నాటికి పూర్తి చేయాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించామని మంత్రి వెల్లడించారు.
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి
మున్సిపాల్టీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ను ఇప్పటికే తొలగించామని, డిసెంబర్ నెలాఖరులోగా మిగిలిన 20 లక్షల టన్నుల లెగసీ వస్తును తొలగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
జనవరి నుండి రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ పూర్తిగా ప్రారంభమవుతుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో పాటు మరో ఆరు ప్లాంట్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తయితే రాష్ట్ర మున్సిపాల్టీలు డంపింగ్ యార్డుల నుండి విముక్తి పొందతాయన్నారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లపై ప్రణాళికలు సిద్ధం
రాబోయే రెండేళ్లలో మున్సిపాల్టీల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించేలా అమృత్-2 పథకం ద్వారా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. వర్షపు నీరు, ఇంటి నుంచి వచ్చే నదునీటి నిర్వహణ కోసం కాలువల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.
డ్రైనేజీలు, రోడ్లు, వీధిదీపాల కోసం మున్సిపాల్టీలు తమ వంతుగా నిధులు వెచ్చించాలని, అలాగే అమృత్, AIIB, UIDF వంటి పథకాల నిధులు సమర్థంగా వినియోగించాలని సూచించారు.
ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు
మున్సిపాల్టీల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని, పూర్తైన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణం 100 శాతం పూర్తవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వర్క్షాప్లో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. బుధవారం, గురువారం కూడా మిగతా మున్సిపాల్టీల అధికారులతో వర్క్షాప్ కొనసాగనుంది.