కాలుష్య నియంత్రణ అనుమతుల సరళీకరణ ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బలోపేతం చేయుటకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చర్యలు చేపట్టిందని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాపార సౌలభ్యాన్ని (Speed of Doing Business – SoDB) పెంపొందించేందుకు పరిశ్రమల నియంత్రణ ప్రక్రియలను సరళీకరించేందుకు, వేగవంతం చేయడానికి అనేక చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. డిజిటలైజేషన్, ప్రక్రియల సరళీకరణ ద్వారా పరిశ్రమల స్థాపన అనుమతులు, నిర్వహణ అనుమతులు మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించడం జరిగిందన్నారు. ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిశ్రమలు దరఖాస్తులు సమర్పించడం, స్థితిని తెలుసుకోవడం, పారదర్శకంగా అనుమతులు పొందడం సులభమైందని చెప్పారు. నిర్ణయించిన గడువులో అనుమతులు జారీ చేయడం జరుగుతోందన్నారు. పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా పారదర్శకత పెరిగిందని, పేపర్వర్క్ తగ్గిందన్నారు. తక్కువ ప్రమాదం గల పరిశ్రమలకు సరళమైన విధానాలు అమలులో ఉన్నాయన్నారు. అర్హత గల పరిశ్రమలకు అనుమతుల స్వయంచాలక పునరుద్ధరణ సౌకర్యం ఉందని, రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ కేటగిరీలుగా వర్గీకరణ చేయడం జరిగిందని చెప్పారు. 24/7 హెల్ప్డెస్క్లు, ఆన్లైన్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు అందుబాటులోకి తేవడం జరిగిందని వివరించారు. కొన్ని సందర్భాల్లో పరిశ్రమల వైపు నుంచి వచ్చే సమస్యలు ప్రాసెసింగ్లో ఆలస్యాలకు దారితీస్తున్నాయని, అనుమతి, ప్రాసెసింగ్ ఫీజులు ఆలస్యంగా చెల్లించడం, అవసరమైన పత్రాలు లేకుండా దరఖాస్తులు సమర్పించడం, కంప్లయెన్స్ రిపోర్టులు, స్పందనలు ఆలస్యంగా ఇవ్వడం, దరఖాస్తుల సమర్పణ తరువాత తరచూ మార్పులు చేయడం వల్ల ఆలస్యం జరుగుతోందని వివరించారు. అన్ని పరిశ్రమల ఫీజులను సమయానికి చెల్లించడం, పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించడం, నియంత్రణ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని గుంటూరు ప్రాంతీయ కార్యాలయం విజ్ఞప్తి చేస్తోందన్నారు. వేగవంతమైన అనుమతి వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు పరిశ్రమల సహకారం అవసరమని అన్నారు. ఇండస్ట్రీ స్థాపన కోసం CTE, CTO లకు దరఖాస్తు చేసిన పారిశ్రామికవేత్తలు అందించిన ప్రజా అభిప్రాయం (Positive public perception), ఆధారంగా, APPCB పరిధిలోని RO-Guntur కార్యాలయం ఫిబ్రవరి నెలలో 100% పనితీరు సాధించి రాష్ట్ర స్థాయిలో 1వ స్థానాన్ని పొందగా, మార్చి నెలలో 93.8% పనితీరు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానాన్ని పొందిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక అభివృద్ధి మధ్య సమతుల్యతను కొనసాగిస్తూ, పారదర్శక, సాంకేతిక ఆధారిత పరిపాలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.



