గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, నిర్మాణ పనుల వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అరండల్ పేట, బ్రాడిపేటల్లో రోడ్ల మీద ఆక్రమణలను యుద్దప్రాతిపదిన తొలగించడానికి, ఆయా ప్రాంతాల్లో రోడ్ల మరమత్తులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అరండల్ పేట 1వ లైన్, బ్రాడీపేట 1, 4వ లైన్ లు, లాడ్జి సెంటర్ నుండి బ్రాడిపేట వైపుగా కంకరగుంట ఆర్యుబికి వచ్చే మార్గం, డొంక రోడ్ తదితర ప్రాంతాల్లో జిఎంసి పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యటించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణ పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున, రోడ్ల ఆక్రమణల తొలగింపు, రోడ్ల మరమత్తులను తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా డొంక రోడ్, బ్రాడిపేట, అరండల్ పేటల్లోని రోడ్లు ఆక్రమణలతో, పలు భవనాలు రోడ్ మీదకు ర్యాంప్ ల ఏర్పాటుతో కుచించుకుపోయాయని, పట్టణ ప్రణాళిక అధికారులు యుద్దప్రాతిపదికన తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలు తొలగింపు వెంటనే రోడ్ మరమత్తులు పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, కమర్షియల్ సంస్థలు, టిఫిన్ బండ్లు వారు రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్ధాలు వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. వార్డ్ సచివాలయాల వారీగా డంపింగ్ పాయింట్స్ లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించడంపై ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ లు దృష్టి సారించాలన్నారు.
286 1 minute read