
గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల్లో మార్పు రావాలని, వార్డ్ సచివాలయం వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం తప్పనిసరిగా జరగాలని, ఇప్పటికే పారిశుధ్య పనులపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సామవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, కార్యదర్శులతో పారిశుధ్య పనులు, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు భాధ్యత వహించాలన్నారు. ఇప్పటికే ప్రజల నుండి పారిశుధ్య పనులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం మస్టర్ ఆనంతరం మెయిన్ రోడ్లు శుభ్రం, ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేపట్టాలన్నారు. ఇప్పటికే నూతనంగా డంపర్ బిన్లను, పుష్ కాట్స్ ని అందించామని, డివిజన్ల వారీగా అవసరం మేరకు అదనపు ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు. 802 మైక్రో ప్యాకేట్స్ వారీగా మెరుగైన పారిశుధ్యం కోసం కృషి చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిని విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అవసరాలకు తగిన విధంగా కార్మికుల రేషనలైజేషన్ చేయాలని, డివిజన్ల వారీగా జరిగిన రేషనలైజేషన్ వివరాలు అందించాలని ఎంహెచ్ఓ, సిఎంఓహెచ్ ని ఆదేశించారు. శానిటరీ సూపర్వైజర్లు క్షేత్ర స్థాయిలో మరింతగా పర్యవేక్షణ చేయాలని, తమ పర్యటనల్లో ప్రజల నుండి పారిశుధ్య పనులపై ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవన్నారు. నగరంలో డి&ఓ ట్రేడ్ లైసెన్స్లు ఉండాల్సిన సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయని, ఈ నెల 15లోపు వార్డ్ సచివాలయాల వారీగా ట్రేడ్ లైసెన్స్ లపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. 15వ తేదీ అనంతరం కార్యదర్శి, ఇన్స్పెక్టర్, సూపర్వైజర్లు, ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్ లు, రెన్యువల్ చేసుకున్నవి, నూతనంగా తీసుకోవాల్సినదానిపై సంతకాలు చేసిన నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం నగరంలో ట్రేడ్ లేకుండా కమర్షియల్ సంస్థలు ఉండడానికి వీలులేదని, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రేడ్ లేని సంస్థలకు చట్టప్రకారం నోటీసులు అందించి, స్పందించని వాటిని సీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిఎంఓహెచ్ఓ డాక్టర్ పిజె అమృతం, ఎంహెచ్ఓ రవిబాబు, సిటి ప్లానర్ రాంబాబు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, వెటర్నరీ సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎంహెచ్ఓ ఆనందకుమార్, శానిటరీ సూపర్వైజర్లు ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, ప్రజారోగ్య విభాగ సూపరిండెంట్ పోలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







