Guntur News: ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రజా సౌకర్యార్ధం తక్షణం ప్రారంభించాలి
GUNTUR COMMISSIONER VISIT
గుంటూరు నగర పరిధిలోని రెడ్డిపాలెం – ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రజా సౌకర్యార్ధం తక్షణం ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, గోరంట్ల, హిమని నగర్, సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను, రెడ్డిపాలెం రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభమైతే నగరంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని, అందులో భాగంగా ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి వేగంగా చేపట్టాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. రెడ్డిపాలెం రోడ్ చాలా కీలకమని, రోడ్ నిర్మాణ పనుల జాప్యంపై ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ ప్రస్తుతం ఉన్న కొలతలతోనే రోడ్ నిర్మాణం చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విస్తరణ పనులు పూర్తి అయిన అనంతరం బ్యాలెన్స్ రోడ్ నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళిక అధికారులు ఆర్డీపి మేరకు విస్తరణ పనులకు మార్కింగ్ ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో రోడ్, డ్రైన్ ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. హిమని నగర్, సరస్వతి నగర్ ల్లో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని వాటికి బిల్లులు చెల్లింపు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. నూతన రోడ్ నిర్మాణ పనులు తప్పనిసరిగా డ్రైన్ నిర్మాణం, డ్రైన్ టు డ్రైన్ జరిగేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు.పర్యటనలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ రమేష్ బాబు, ఏసిపి మల్లిఖార్జున, ఆర్ఓ రవి కిరణ్ రెడ్డి, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.