కృష్ణా నగర్ లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్ భవనానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక రైతు బజారు అన్నారు. రూ.4 కోట్లు స్థలం విలువ కాగా, రూ.2 కోట్లతో భవనం నిర్మాణం జరుగుతుందన్నారు. 9 నెలలలో భవన నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. 30 డ్వాక్రా స్టాల్ లు, 60 రైతు స్టాల్ లు, 10 దుకాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. రైతు బజారు నిర్మాణం పక్కాగా ఉండాలని, పార్కింగ్ వ్యవస్థ నిర్దిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు బజారు నిర్వహణలో ఎటువంటి అలసత్వం లేకుండా చూడాలని, చుట్టుప్రక్కల నివాసాలకు ఎటువంటి అసౌకర్యం ఉండరాదని స్పష్టం చేశారు. శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజా మాట్లాడుతూ అందరికీ అనుకూలమైన ప్రదేశంలో రైతు బజారు ఏర్పాటు కావడం ముదావహం అన్నారు. శాసన సభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ అభివృద్ధి పథంలో కూటమి నడుస్తుందన్నారు. రెండు అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతుందన్నారు. వంద స్టాల్ లు వస్తాయని చెప్పారు. మార్కెటింగ్ శాఖ నిర్వహణ చేస్తుందన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం, పార్కింగ్ కల్పించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్రా అప్పారావు మాట్లాడుతూ రూ. 2 కోట్ల వ్యయంతో రైతు బజారు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కూరగాయలతో పాటు పండ్లు, పూల మార్కెట్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, గాదె వెంకటేశ్వరరావు, పిల్లి మాణిక్య రావు తదితరులు పాల్గొన్నారు.



