GUNTUR CITY NEWS: ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర గుంటూరు సాధ్యం

Karthik
Oplus_16908288

నగర ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర గుంటూరు సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కొబ్బరితోటలో ఉన్న జీఎంసీ ప్లాంట్స్ డబ్ల్యూ.హెచ్.ఈ, శానిటరీ వేస్ట్ షెడ్ మరియు ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, ఈ-వేస్ట్ నిర్వహణ, కంపోస్టింగ్ విధానాలు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు మరియు వ్యర్థాల శుద్ధి ప్రక్రియలను పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న పనుల పురోగతి, చెత్త వర్గీకరణ ప్రక్రియ, పారిశుద్ధ్య నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై అధికారులతో మరియు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న కార్మికులను ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం నాయకులు, కార్మికులు, ప్రజలతో కలిసి స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…* రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి శనివారం ప్రత్యేక ఎజెండాతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈసారి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను పరిశీలిస్తూ గుంటూరు నగరంలోని చెత్త నిర్వహణ వ్యవస్థను సమీక్షిస్తున్నామని తెలిపారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 428 టన్నుల చెత్త ఈ కేంద్రానికి వస్తోందని, అందులో దాదాపు 100 టన్నుల వ్యర్థాలను వర్మీ కంపోస్ట్ మరియు విండ్ రో కంపోస్ట్ రూపంలో ఎరువులుగా మార్చుతున్నారని చెప్పారు. మిగిలిన ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కోసం జిందాల్ సంస్థకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కేంద్రం సమర్థవంతంగా నిర్వహించబడటం చాలా ముఖ్యమని, 26 మంది సిబ్బంది నిరంతరం సేవలందిస్తూ నగర పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. అలాగే జీఎంసీ పరిధిలో “క్లస్టర్ కంపోస్టింగ్” కాన్సెప్ట్‌ను అమలు చేస్తూ ప్రతి డివిజన్‌లో కంపోస్ట్ బిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్‌గా మార్చుకొని వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.కేంద్రంలో తయారయ్యే వర్మీ కంపోస్ట్‌ను నగరంలోని మొక్కలు, డివైడర్లు, అవెన్యూ ప్లాంటేషన్లకు వినియోగిస్తున్నామని, “మన చెత్తతో మనమే ఎరువు తయారు చేసుకొని స్వయం సమృద్ధి గల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణలో ప్రజల సహకారం ఇంకా అవసరమని, తడి చెత్త, పొడి చెత్త, ఈ-వేస్ట్ కోసం మూడు వేర్వేరు డస్ట్‌బిన్లు పంపిణీ చేసినప్పటికీ చాలామంది ఇంటి వద్దే చెత్తను వేరు చేయకుండా ఒకేసారి పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల శుద్ధి కేంద్రంలో వాటిని విభజించుకోవడానికి కష్టతరమవుతోందన్నారు.ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల అవే మినీ డంపింగ్ యార్డులుగా మారుతున్నాయని, అది చివరికి ప్రజల ఆరోగ్యానికే ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. ప్రజలు ఇంటి నుంచే చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తే వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు.

Author
Share This Article
Leave a review