చింతలపూడి (ఏలూరు జిల్లా):– రైతుల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన యూసీజీ (అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్) బొగ్గు ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక రైతులతో నిర్వహించిన సమావేశంలో భూములు, భూగర్భ జలాలు, పర్యావరణ పరిరక్షణ, నష్టపరిహారం మరియు ఉపాధి అవకాశాలపై రైతులు ఎదుర్కొంటున్న ఆందోళనలను నాయకులు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ… సీపీఐ పార్టీ ఎప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో తరతరాలుగా భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులకు అన్యాయం చేయడం తగదని స్పష్టం చేశారు. గతంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం భూములు ఇచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. భూములు కోల్పోతున్న ప్రతి రైతుకూ న్యాయమైన, సంతృప్తికరమైన నష్టపరిహారాన్ని అందించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రైతుల అభిప్రాయమే తమ పార్టీ అభిప్రాయమని తేల్చిచెప్పారు.Eluru district news
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చినా రైతులు, సామాన్య ప్రజలే తమ జీవనోపాధిని, భూములను త్యాగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో లక్షల ఎకరాలు సేకరిస్తున్న ప్రభుత్వం, రైతుల సంక్షేమాన్ని విస్మరించడం సరైంది కాదన్నారు.
ఈ కార్యక్రమంలో యూసీజీ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు, రేచర్ల మాజీ సర్పంచ్ శివ రామకృష్ణ, మాజీ ఎంపీపీ రాంబాబు, మాజీ జడ్పీటీసీ నీరజ సుధాకర్తో పాటు పలువురు సీపీఐ నాయకులు, స్థానిక రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



