
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో ఉన్న ఎన్టీఆర్ ఫిష్ మార్కెట్ పరిసరాల్లో పారిశుభ్రత సమస్యలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. మార్కెట్లో ఉత్పత్తి అవుతున్న చేపల కళేబరాలు, మేకల అవశేషాలు, ఇతర వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించకుండా సమీపంలోని కొత్త కాలువలో పడేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో కాలువ నీరు తీవ్రంగా కలుషితమవుతూ, పరిసర ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కాలువలో చేరడంతో భూగర్భ జలాలు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మార్కెట్ సమీపంలోని బ్రిడ్జ్పై రహదారి ఇరువైపులా ఇసుక పేరుకుపోవడం వల్ల వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యలపై పంచాయతీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మార్కెట్ నిర్వహణలో పారిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, కాలువలో వ్యర్థాల పారబోతను తక్షణమే నిలిపివేయాలని, మార్కెట్ ప్రాంతంలో పారిశుభ్రత చర్యలు చేపట్టాలని, రహదారి భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


