GUNTUR CITY NEWS: ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యర్ధాలను తొలగించాలి

Karthik

గుంటూరు నగరంలో వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తైన ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్ధాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని, నిర్మాణానికి ముందే పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్, గాయత్రి నగర్, ఆటో నగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి, పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో జరుగుతున్న డ్రైన్ పనులను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ పనులు చేపట్టడానికి ముందే మార్కింగ్ ని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి చేయాలని, తద్వారా పనుల్లో సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. పనులు పూర్తైన ప్రాంతాల్లో సదరు కాంట్రాక్టరే నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని స్పష్టం చేశారు. సదరు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నూతన పార్క్ పనులను తనిఖీ చేసి, 2 వారాల్లోగా సివిల్ వర్క్ లు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని డిఈఈకి తెలిపారు. డ్రైన్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ సమయాల్లో విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలన్నారు. బహుళ అంతస్తు నిర్మాణదారులు డ్రైన్ ని అవుట్ ఫాల్ లేదా మేజర్ డ్రైన్ లోకి కలిపితేనే తదుపరి అనుమతులు ఇచ్చేలా పట్టణ ప్రణాళిక అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో ఖాళీ స్థలాల్లోకి డ్రైనేజి వదిలే అపార్ట్మెంట్ లకు పబ్లిక్ హెల్త్ అధికారులు నోటీసులు జారీ చేయాలన్నారు. ఆటో నగర్ రోడ్ వెంబడి లో లెవల్ ఏరియాల్లో మెరక చేయాలని ఏఈని, సదరు ప్రాంతాల్లో వ్యర్ధాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. ఆటోనగర్ వ్యర్ధాలు సేకరణకు నిర్దేశిత విధానం ఏర్పాటు చేసుకునేలా సదరు అధికారులతో సమన్వయం చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు.పర్యటనలో అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఈఈ(ఇంచార్జి) కళ్యాణరావు, డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ ఐజాక్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review