పరిశ్రమల్పలో పర్యావరణ అనుకూల విధానాలు అమలు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే భాద్యత తీసుకోవాలని పారిశ్రామికవేత్తలకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కాలుష్య నియంత్రణ మండలి “ఒక పరిశ్రమ – ఒక హరిత చొరవ” నినాదం తో రూపొందించిన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే శక్తి ప్రతి పరిశ్రమకూ ఉందని, కావున ముందుండి నడిపించి, మార్పుకు కారకులవడమే కాకుండా ఇతరులకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. వ్యర్థాలను తగ్గించి, వాటిని పునర్వినియోగించి పునరుత్పత్తి చేయడమే కాకుండా వనరులను పునరుద్ధరించడం, నీటి సంరక్షణ, సుస్థిరమైన రేపటి కోసం ఈరోజే శక్తిని ఆదా చేయడం, పచ్చదనాన్ని పెంచి, గాలి నాణ్యతను మెరుగుపరచడం వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అమలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఖాజావలి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నజీనా బేగం, ఇతర అధికారులు పాల్గొన్నారు.



