గుంటూరు పరిధిలోని బొంతపాడు వద్ద జరుగుతున్న ప్రస్తుత హోల్సేల్ కూరగాయల మార్కెట్ను తొలగించవద్దని హోల్సేల్ వ్యాపారులు, రైతులు, కూలీలు శనివారం కార్పొరేషన్ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 25 ఏళ్లుగా ఈ మార్కెట్పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ, ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్పై సుమారు 1500 మంది రైతులు, 200 మంది కూలీలు ఆధారపడి ఉన్నారని తెలిపారు. దాదాపు 5000 కుటుంబాల జీవనోపాధి ఈ హోల్సేల్ కూరగాయల మార్కెట్తో ముడిపడి ఉందని వివరించారు. గత పదేళ్లుగా నగర బైపాస్ ప్రాంతంలో విశాలమైన స్థలం కేటాయించి ఆధునిక హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని ప్రతి కమిషనర్కు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత మార్కెట్ను కొల్లి శారద ప్రాంతానికి తరలిస్తే ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొల్లి శారద ప్రాంతంలో మార్కెట్ కొనసాగితే ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలిపారు. అవసరమైతే ట్రాఫిక్ పోలీసు అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించాలని కమిషనర్ను కోరారు. అలాగే కొల్లి శారదలో షాపులు లీజుకు తీసుకున్న వారిలో చాలామంది అసలు వ్యాపారులు కాదని ఆరోపించారు. ఒకే షాపును పగలు ఒకరికి, రాత్రి మరొకరికి ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన రైతులు, వ్యాపారులు తమ పక్షాన ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం తాము వ్యాపారం చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి, అదే ప్రాంతంలో మార్కెట్ కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని కమిషనర్ను కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత మార్కెట్ను తొలగించకుండా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.



