GUNTUR DISTRICT NEWS: ప్రారంభమైన ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం

Karthik

ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు (One Month – One Constituency – Four Visits) మొదటి కార్యక్రమం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ, ప్రత్తిపాడు శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ ల సమావేశంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సంకల్పించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయుటకు, వాటి పట్ల అవగాహన కల్పించుటకు ఇది ఒక మంచి వేదిక కానుంది. అంతేకాకుండా ప్రజల ముంగిటకే ప్రభుత్వం వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుటకు అవకాశం కలుగుతుంది. ప్రజలు వ్యయ ప్రయాసలకు లోనై జిల్లా కేంద్రం వరకు వచ్చి అర్జీలు సమర్పించడం, వాటి స్థితిని తెలుసుకొనుటకు పలుమార్లు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. నియోజక వర్గం స్థాయిలోనే నెలకు నాలుగు సార్లు అధికారులు సందర్శించడం వలన ప్రజలు స్థానికంగానే అర్జీల పరిష్కారం వివరాలు సైతం తెలుసుకునే అవకాశం ఉంది. ప్రజల అర్జీలకు వారి సమక్షంలోనే నాణ్యమైన పరిష్కారం కూడా లభిస్తుంది. ఇప్పటికే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుంది. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా జిల్లాలో నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చిందన్నారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలో 13 వేల అర్జీలు అందగా 9,359 అర్జీలు పరిష్కారం చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు పరిష్కారంలో జాప్యం జరుగుతుందని పిర్యాదులు వస్తున్నాయన్నారు. సమస్యలు లేని (జీరో గ్రీవెన్స్) సమాజాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. రెవెన్యూ అంశాలలో మ్యుటేషన్, ఇనామ్, భూ కొనుగోలు, గిఫ్ట్ డీడ్, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఎస్టేట్ ఎబోలిషన్ చట్టం కింద ఉన్న పిర్యాదులపై దృష్టి సారించాలని సూచించారు. *వచ్చే శుక్రవారం పెదనందిపాడులో*ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు (One Month – One Constituency – Four Visits) కార్యక్రమాన్ని వచ్చే శుక్రవారం పెదనందిపాడులో నిర్వహించుటకు నిర్ణయించారు. పెదనందిపాడులో నిర్వహించే కార్యక్రమంలో పెదనందిపాడు, కాకుమాను మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను సర్పించవచ్చని జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ గంగ రాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, ఎస్.సి కార్పొరేషన్ ఇ.డి డి.దుర్గా భాయి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, జిల్లా పర్యాటక అధికారి రమ్య, దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ మాధవి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ, ఆర్.టి.ఓ కె శ్రీహరి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎడ్ల భాస్కర్ రావు, సర్వే ఉప సంచాలకులు తోయజాక్షజ రావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ,  ప్రత్తిపాడు నియోజకవర్గ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review