GUNTUR DISTRICT NEWS: బక్రీద్ రోజున గో వధ జరగరాదు

Karthik

జంతు వధ నిషేధిత చట్టం కింద గో వధ జరగరాదనిజిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. గో వధ నిషేధం మరియు జంతు వధ నివారణ చట్టం క్రింద బక్రీద్ రోజున గో వధ, ఇతర అనధికార జంతువుల వధపై జిల్లా కమిటీ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అధీకృత స్థలంలో మినహా బయట ఎక్కడ జంతు వధ జరగరాదని చెప్పారు. గోవులను వధించరాదని, అధికారికంగా ధృవీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అధికారికంగా గుర్తించి ధృవీకరణ జరిగిన జంతు వధ ప్రదేశాలలో మాత్రమే అనుమతించిన జంతువుల వధకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖల పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేశారు. ధృవీకరణ జరిగిన జంతు వధ ప్రదేశాలలో పర్యావరణ అనుమతుల మేరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ శాఖ స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని, కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అధీకృత జంతు వధ శాలలను గుర్తించాలని, తాత్కాలిక జంతు వధ శాలలకు దరఖాస్తు చేసిన వారికి నిబంధనలు మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. తాత్కాలిక జంతు వధ శాలల ఏర్పాటుకు మున్సిపల్, రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. తాత్కాలిక జంతు వధ శాలల ఏర్పాటు, అనుమతులు వంటి అంశాలపై జిల్లా మైనార్టీ అధికారి సమన్వయ అధికారిగా పనిచేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఏర్పాట్లు, సమన్వయంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంతు వధ శాలల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. జంతు రవాణాను పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన బృందాలు పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ సైతం పశు రవాణాపై నిఘా పెట్టాలని ఆదేశించారు. *సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తే చర్యలు*సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా పెట్టమని జిల్లా కలెక్టర్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అనవసర వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనవసర వదంతులు సృష్టించే వారిపైన, వదంతులుపైన సమాచారం అందించాలని ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను కోరారు. పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ రోజున గో వధ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. డ్రోన్ ద్వారా పరిశీలన చేస్తామని చెప్పారు. కొన్ని సున్నిత ప్రదేశాలను గుర్తించామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులపైనా నిఘా పెట్టమని తెలిపారు. బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ బక్రీద్ రోజున గో వధ జరగరాదన్నారు. గో వధ జరగకుండా పర్యవేక్షణకు పశు సంవర్ధక శాఖ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. మూడు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఎద్దులను కూడా వధించరాదని అన్నారు. దేనికి ఉపయోగపడదని అధికారికంగా ధృవీకరించిన తరువాత మాత్రమే వధించుటకు అవకాశం ఉందని చెప్పారు. గర్భం దాల్చిన ఏ జంతువును వధించరాదని పేర్కొన్నారు. ఒంటె లను కూడా వధించరాదని చెప్పారు. గో సంరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అనధికార ప్రదేశాలలో గో వధ జరిగే అవకాశాలు ఉన్నాయని, డ్రోన్ ద్వారా నిఘా పెట్టి పరిశీలన చేయాలని కోరారు. ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, తెనాలి ఇన్ ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఉప రవాణా కమిషనర్ కె.సీతారామి రెడ్డి, డి.ఎస్పీలు అజీజ్, శ్రీనివాస్, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం, గో సంరక్షణ కమిటీ సభ్యులు బి.వి.శివ రావు, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review