GUNTUR DISTRICT NEWS: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన గుంటూరు జిల్లా పోలీసులు

Karthik

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ మరియు ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో గుంటూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్బీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ సంకురయ్య నేతృత్వంలో ఉదయం 6:30 గంటల నుంచి 7:00 గంటల వరకు ర్యాలీ జరిగింది. జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్ వరకు వెళ్లి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది.‌ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాహనాల వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడం ద్వారా గాలి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పాటు పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 5251 బి.వి. నారాయణ ప్రారంభించారు. ర్యాలీలో ఎస్బీ డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి , సురేష్, రామకృష్ణ రెడ్డి, ఆర్ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Author
Share This Article
Leave a review