విజయవాడ, జూన్ 19 :– ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం అందించారు.

దర్శనానంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జగన్మాత కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఆధ్యాత్మిక, మౌలిక వసతుల అభివృద్ధి పనులపై ఆలయ అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న మంత్రి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.



