గుంటూరు: నగరంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమృత్ 2.0 – అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకాల కింద రూ.577.19 కోట్ల వ్యయంతో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు గోరంట్లలో శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణతో కలిసి ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఫైలాన్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, గుంటూరు నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా నగర ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పైప్లైన్ల విస్తరణ, కొత్త ఓవర్హెడ్ రిజర్వాయర్ల నిర్మాణం, పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ వంటి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గుంటూరు నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పట్టణాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యారావు, గాదె వెంకటేశ్వరరావు, వడ్రాణం హరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



