చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెం గ్రామంలో పిడుగుపాటు ఘటన కలకలం రేపింది. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
గ్రామానికి చెందిన ఉలవ రాఘవరావు (53), సంకు సత్యనారాయణ (47) పిడుగుపాటుకు గాయపడినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.EluruDistrict
పిడుగుపాటు ఘటన సమాచారం తెలుసుకున్న చింతలపూడి జనసేన పార్టీ అధ్యక్షుడు చిదరాల మధుబాబు, తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు తాటి అప్పారావు, ఆసుపత్రి హెచ్డీఎస్ సభ్యుడు కంభం రమేష్, మాజీ పంచాయతీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు అట్లూరి శ్రీనివాసరావు (ఇసుక శ్రీను) ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకుని వర్షం కురుస్తున్న సమయంలో ఈ పిడుగుపాటు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనతో గ్రామంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.



