ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో మానవత్వంతో వ్యవహరించాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సూచించారు.సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, డిప్యుటీ కలెక్టర్ డేవిడ్ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం చూపకుండానే అర్జీలను మూసివేసే అధికారులపై చర్యలు తప్పవన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల వద్దకు ఎప్పటివలెనే జిల్లా కలెక్టర్ నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కు మొత్తం 453 అర్జీలు అందాయి. అందులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 184, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 159 అర్జీలు, గుంటూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 5 అర్జీలు, తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో 22 అర్జీలు, గుంటూరు నగర పాలక సంస్థకు 64, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో 7 అర్జీలు అందాయి. చేతన ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వీల్ చైర్ లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. దివ్యాంగులను ఎంపిక చేసి వీల్ చైర్ లను పంపిణీ చేసిన చేతన ఫౌండేషన్ కు జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.



