నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మరియు గోడలపై అంటించిన పోస్టర్లను తక్షణమే తొలగించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డివైడర్లు, కార్యాలయాల గోడలు, బ్రిడ్జిల గోడలు మరియు బహిరంగ ప్రదేశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు కట్టే వారు, పోస్టర్లు అంటించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అటువంటి వారిపై భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోస్టర్ ఫ్రీ సిటి కోసం జిఎంసి తీసుకుంటున్న చర్యలు, వివిధ వర్గాలు, సంస్థల సహకారం, నిబందనలు, చర్యలపై వివరించడానికి ఈ నెల 25 (శనివారం) ఉదయం 11 గంటలకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు మరియు ప్రింటింగ్ ప్రెస్ సంఘాల ప్రతినిధులు, సినిమా హాల్స్ ప్రతినిధులు, ఫ్లెక్సీ ప్రింటర్స్ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గుంటూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చడంలో ప్రజలు, వ్యాపార సంస్థలు మరియు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ సమావేశంలో తమ అమూల్యమైన సూచనలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. నగర సౌందర్యానికి విఘాతం కలిగిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.



