GUNTUR DISTRICT NEWS: చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలు అందాలి: కలెక్టర్

Karthik

చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ప్రభుత్వ సేవలు అందించడంలో యంగ్ ప్రొఫెషనల్స్, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది కీలక పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. పీపుల్ సెంట్రిక్ గా పనిచేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల సిబ్బంది, యంగ్ ప్రొఫెషనల్స్ తో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందాలన్నారు. ఇందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అందులో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఒకటన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలని అన్నారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందిందా, లేదా అనే అంశాన్ని సైతం పక్కాగా ఆడిట్ చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో అమలు అవుతున్న పథకాలు, కార్యక్రమాల అమలులో పర్యవేక్షణ చేసి సత్ఫలితాలు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సేవలు నిరంతరం నాణ్యతతో అందడంలో ఎటువంటి వెలితి లేకుండా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. యంగ్ ప్రొఫెషనల్స్, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది ప్రస్తుతం విజన్ యూనిట్ లలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, యంగ్ ప్రొఫెషనల్స్, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review