GUNTUR DISTRICT NEWS: పక్కా ప్రణాళికలతో GST లక్ష్యాలు సాధించాలి

Karthik
4 Views

రాష్ట్ర GST లక్ష్యాలను సాధించుటకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. రాష్ట్ర జి.ఎస్.టి వసూళ్ల పెంపుపై వివిధ శాఖలతో సమన్వయ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ప్రభుత్వ పనులు పూర్తి చేసిన అనంతరం బిల్లులు అప్ లోడ్ చేసే సమయంలో జి.ఎస్.టి వివరాలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్ర జి.ఎస్.టి జాయింట్ కమిషనర్ గీతా మాధురి మాట్లాడుతూ గుంటూరు ఒకటవ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్ లు ఉన్నాయన్నారు. ఎస్.జి.ఎస్.టి లక్ష్యం రూ.134.33 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.109.43 కోట్లను సాధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పనులు చేస్తున్న గుత్తేదారుల నుండి చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని, ప్రభుత్వ పనులు జరుగుతున్న వివరాలు అందించాలని కోరారు. విద్యా శాఖ అధికారులు వివిధ ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సమర్పించడం వలన పన్నుల వసూళ్లకు అవకాశం ఉంటుందన్నారు. రూ.15 వేలు కంటే ఎక్కువ వేతనం పొందుతున్న వారి నుండి వృత్తి పన్ను వసూలు చేయుటకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.హెచ్. కృష్ణ, ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్, ఎం.టి.ఎం.సి అదనపు కమిషనర్ శకుంతల, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పల నాయుడు, పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్ డి.శైలజ, జి.ఎస్.టి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review