GUNTUR CITY NEWS: బక్రీద్ సమయంలో గో వధ జరగరాదు

Karthik

జంతు వధ నిషేధిత చట్టం కింద గో వధ జరగరాదనిజిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. గో వధ నిషేధం మరియు జంతు వధ నివారణ చట్టం, 1977 క్రింద బక్రీద్ రోజున గో వధ, ఇతర అనధికార జంతువుల వధపై జిల్లా కమిటీ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అధీకృత స్థలంలో మినహా బయట ఎక్కడ జంతు వధ జరగరాదని చెప్పారు. గోవులను వధించరాదని, అధికారికంగా ధృవీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖ స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని, కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అధీకృత జంతు వధ శాలలను గుర్తించాలని, తాత్కాలిక జంతు వధ శాలలకు దరఖాస్తు చేసిన వారికి నిబంధనలు మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. డివిజనల్ స్థాయి కమిటీలు జంతు వధ శాలలకు సంబంధించి సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. జంతు రవాణాను పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ బక్రీద్ రోజున గో వధ జరగరాదన్నారు. గో వధ జరగకుండా పర్యవేక్షణకు పశు సంవర్ధక శాఖ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. మూడు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఎద్దులను కూడా వధించరాదని అన్నారు. దేనికి ఉపయోగపడదని అధికారికంగా ధృవీకరించిన తరువాత మాత్రమే వధించుటకు అవకాశం ఉందని చెప్పారు. గర్భం దాల్చిన ఏ జంతువును వధించరాదని పేర్కొన్నారు. ఒంటె లను కూడా వధించరాదని చెప్పారు. ఈ సందర్భంగా పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, తెనాలి ఇన్ ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఆర్.టి.ఓ శ్రీహరి, గో సంరక్షణ కమిటీ సభ్యులు హరి హర రాయలు, బి.వి.శివ రావు, దాసరి రాము, జాగు నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review