GUNTUR CITY NEWS: క్లీన్ గుంటూర్ గ్రీన్ గుంటూర్ లో ప్రజలు భాగస్వాములు కావాలి

Karthik

“ఆపరేషన్ క్లీన్ స్వీప్” తో నాలుగు వారాల్లో గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా ప్రజల భాగస్వామ్యంతో తీర్చిదిద్దడానికి వార్డ్ ల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుధ్యంలో మెరుగైన చర్యల్లో భాగంగా 4 వారాల స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ని స్తానిక నాజ్ సెంటర్ లోని 6 ప్రధాన రోడ్లలో రోడ్ కి 50 మంది కార్మికులతో ప్రత్యేక పారిశుధ్య పనులను కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నెల 3వ శనివారం సాసా కార్యక్రమంలో ఏదో ఒక్క జిల్లాలో నేరుగా పాల్గొంటున్నారంటే స్వచ్చతకు ఉన్న ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రత్యేక దృష్టిని తెలుసుకోవచ్చన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా మొదటి వారం రోజుల్లో నగరంలోని ‘రెడ్ స్పాట్లు’ (ఎక్కువగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు) మరియు ‘ఎల్లో స్పాట్లు’ను ప్రత్యేకంగా గుర్తించి, వాటిని పూర్తి స్థాయిలో క్లియర్ చేసి పరిశుభ్రంగా మారుస్తామని తెలిపారు. ఆ తర్వాత రెండవ వారంలో నగరంలోని వరద నీటి కాలువలు, ప్రధాన కాలువలు మరియు ఉప కాలువల్లో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించేందుకు ఉధృతంగా పనులు చేపడతామని వివరించారు. మూడవ వారంలో నివాస ప్రాంతాలు మరియు వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ పేరుకుపోయే చెత్తను పూర్తి స్థాయిలో తొలగించి పరిసరాల స్వచ్ఛతను కాపాడుతామన్నారు. ఇక చివరిదైన నాల్గవ వారంలో నగరంలోని బహిరంగ మరుగుదొడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర ముఖ్యమైన సామూహిక ప్రాంతాలలో విస్తృతంగా పారిశుధ్య చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో నగరంలో వార్డ్ ల వారీగా ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటిలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానికులను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేస్తూ, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు వేయవద్దని, తడిపొడిగా ప్రజారోగ్య కార్మికులకే చెత్త ఇవ్వాలని, రోడ్లపై, డ్రైన్లళోఈ వ్యర్ధాలు వేసే వారిపై భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని అవగాహన కల్గించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా సంచులను అందిస్తామని, వ్యర్ధాలను వారు అందులో వేసి, ఉదయం లేదా సాయంత్రం వచ్చే కార్మికులకే ఇవ్వాలన్నారు. పెద్ద మొత్తంలో చెత్త ఉత్పత్తి చేసే సంస్థలు తప్పనిసరిగా వ్యర్ధాల నిర్వహణ చేసుకోవాలన్నారు. వేడి గాలులు, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజారోగ్య కార్మికులు ఉదయం కొంత ముందస్తుగా పారిశుధ్య పనులు ప్రారంభించి, ఎండ సమయంలో పనులు చేయవద్దని సూచించారు. గుంటూరు నగరాన్ని స్వచ్చ, సుందర నగరంగా తీర్చిదిద్దుకోవడంలో నగరపాలక సంస్థతో పాటు ప్రజలు, వివిధ స్వచ్చంద సంస్థలు, ఉద్యోగులు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో భాగస్వాములు కావాలని కోరారు.అనంతరం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి, కార్మికులతో కలిసి ప్రధాన రోడ్లను ఊడ్చి, కొత్తపేట వరకు అవగాహన ర్యాలీ చేశారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఈఈ సుందర్రామిరెడ్డి, ఉపా సెల్ పిఓ సింహాచలం, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారయణరెడ్డి, ఎస్ఎస్ లు, ప్రజారోగ్య అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review