బాపట్ల జిల్లా (పర్చూరు నియోజకవర్గం): ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి వారి 72వ వార్షికోత్సవ (తిరునాళ్ళు) మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామానికి విచ్చేసిన దామచర్ల సత్యకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: దామచర్ల సత్య ఈ సందర్భంగా మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ… అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి కృపతో పాడిపంటలు సమృద్ధిగా పండి, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు. ఇంతటి పవిత్రమైన ఉత్సవంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ (TDP) ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిధిలోని భక్తులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో పావులూరు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.



