AP LATEST NEWS: పొగాకు రైతుల ఛలో గుంటూరు విజయవంతం

Karthik
1 View

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి రాయబారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాల నుండి రైతులు వందలాది మంది తరలి వచ్చారు. తొలుత చుట్టుగుంట సెంటర్ నుండి బోర్డు కార్యాలయం వరకు భారీర్యాలీ నిర్వహించి, కార్యాలయ ఆవరణలో బైటాయించారు. వేలం కేంద్రాల్లో నో బిడ్డింగ్‌ ‌విధానాన్ని అరికట్టాలని, కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చి పొగాకు కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వి.శోభనాధ్రీశ్వరరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్‌‌కెఎం కన్వీనర్‌ చుండురు రంగారావు, కౌలు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.ఈశ్వరయ్య తదితరులు బోర్డు చైర్మన్ సిహెచ్‌.యశ్వంత్ కుమార్‌‌, బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీతో చర్చలు జరిపారు. నాయకులు మాట్లాడుతూ కేంద్రం సిగరెట్లపై పన్నులు పెంచటంతో విక్రయాలు తగ్గుతాయనే సాకు చూపి రైతుల వద్ద పంట కొనుగోలుకు కంపెనీలు ముందుకు రావట్లేదన్నారు. అనేక వ్యయప్రయాసలకోర్చి వేలం కేంద్రాలకు వచ్చిన పొగాకు బేళ్లను కొనుగోళ్లు లేక తిరిగి తీసుకెళ్లం రైతులకు మరింత భారంగా మారిందన్నారు. సాధారంగా ఈ సమయానికి సగంపైగా కొనుగోళ్లు జరగాలని, కానీ ఇంత వరకూ 15 శాతమే కొనుగోలు జరిగిందన్నారు. రూ.7వేల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం పొగాకు ద్వారా వస్తుందని, ఇటువంటి సమయంలో రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన రూ.500 కోట్లు అడ్వాన్స్‌ కేటాయించి, రైతుల వద్ద ఉన్న పొగాకును మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం సిగరెట్లపై ఇటీవల జిఎస్‌‌టి 28 శాతం నుండి 40 శాతానికి పెంచిందన్నారు. ఆదాయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వాటా ఉన్నందున్న రాష్ర్ట ప్రభుత్వం కూడా కొంత అడ్వాన్స్‌ ‌కేటాయించాలన్నారు. ఎగుమతులు పెంచటానికి, కంపెనీలు ఇచ్చిన ఇండెంట్‌ ‌ప్రకారం కొ‌నుగోళ్లు చేయించాలన్నారు. రైతుల నాయకుల బృందాన్ని కేంద్రంతో చర్చలకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకట్రావు, జె.జయంతిబాబు, గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ తదితరులు పాల్గొన్నారు. చర్చల అనంతరం బోర్డు చైర్మన్, ఈడి రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. రైతుల డిమాండ్లపై 3న బోర్డు సమావేశం జరిపి, చర్చించి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేయించడానికి బోర్డు కట్టుబడి ఉందని చైర్మన్‌ ‌యశ్వంత్‌‌కుమార్‌ ‌హామీ ఇచ్చారు. కంపెనీలు ఇచ్చిన ఇండెంట్‌ ‌ప్రకారం కొనాలని, లేదంటే నోటీసులు ఇస్తామని, అవసరం అయితే మెడలు వంచి కొనుగోలు చేయిస్తామని చెప్పారు. అలాగే రూ.500 అడ్వాన్స్‌ కేటాయింపునకూ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చనాయుడితో కలిసి కేంద్ర ఫైనాన్స్‌ ‌శాఖను కలిసి ప్రాతినిద్యం చేస్తామన్నారు.

Author
Share This Article
Leave a review