గుంటూరు నగరపాలక సంస్థలో డివిజన్ ల పునర్విభజన అశాస్త్రీయంగా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు లోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ నూరి ఫాతిమా, ప్రత్తిపాడు ఇన్చార్జి బాలసాని కిరణ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. నగరంలో వార్డుల విభజన చేస్తూ నగరపాలక సంస్థ ముసాయిదా విడుదల చేసింది అన్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజనపై అన్ని డివిజన్ల ఇన్చార్జిలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులుతో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. గుంటూరులో 57 డివిజన్ లను 76 డివిజన్ లుగా చేస్తూ నగరపాలక సంస్థ విడుదల చేసిన ముసాయిదా లో ఎక్కడా స్పష్టత లేదని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ డైరెక్షన్లో ఈ ప్రక్రియ చేస్తున్నారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ అంశంపై టీడీపీ నేతల్లో వర్గపోరు ఉందనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. ఈనెల 23న తమ పార్టీ కి ఉన్న అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా కమీషనర్ కు అందజేస్తామని తెలిపారు. డివిజన్ల పునర్వ్యవస్థీకరణ పై అభ్యంతరాలు ఉంటే ప్రజలు ఈనెల 24 కమిషనర్ కు తెలియజేయలని కోరారు.



