*నిందితుడి వాహన కదలికలపై పోలీసులకు అలర్టులు పంపిన ఆర్టీజీఎస్
*నిందుతుడ్ని సకాలంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమరావతి: కర్ణాటక రాష్ట్రంలో లైంగిక వేధింపుల కేసులో నిందితుడు తిరుపతిలోని సీసీకెమెరా కళ్లలో పడి పోలీసులకు చిక్కాడు. కర్నాటకలో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతడ్ని పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితుడు ఇటీవల తిరుపతికి పారిపోయి వచ్చాడనే సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు ఏపీ పోలీసుల సహకారం కోరారు. కర్ణాటక పోలీసులు నిందితుడి వాహనానికి సంబంధించి ఇచ్చిన వివరాల ఆధారంగా ఆ వాహనం కదలికలను ఆర్టీజీఎస్లోని సీసీటీవీ360 వ్యవస్థ ద్వారా గుర్తించారు. ఆ వాహనం ఎక్కడెక్కడ తిరుగాడింది, ప్రస్తుతం ఆ వాహనం ఎక్కడ ఉంది అనే వివరాలను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) విశ్లేషణ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని ఆర్టీజీఎస్ పోలీసులకు అలర్టుల ద్వారా చేరవేసింది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.




