GUNTUR DISTRICT NEWS: సి.ఆర్.డి.ఏ, రెవెన్యూ శాఖలు అత్యంత సమన్వయంతో పనిచేయాలి

Karthik
5 Views

సి.ఆర్.డి.ఏ, రెవెన్యూ శాఖలు అత్యంత సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. సి.ఆర్.డి.ఏ, రెవెన్యూ శాఖల సమన్వయ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణానికి చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలో సి.ఆర్.డి.ఏ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. భూ సంబంధిత అంశాలకు చెందిన దస్త్రాలు సంబంధిత ప్రతిపాదనలు తహసిల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని అన్నారు. భూ సేకరణ అధికారులు భూ సేకరణకు అవసరమగు నోటిఫికేషన్లు, నోటీసులు జారీ చేయడంలో నిర్దిష్టమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో నిబంధనలను పక్కాగా పాటించాలని అన్నారు. జిల్లా నుండి పరిష్కరించవలసిన అంశాలపై స్పష్టమైన వివరాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి రికార్డును డిజిటలైజేషన్ చేయాలని, ఈ ప్రక్రియలో భాగంగా శాటిలైట్ ఛాయాచిత్రాలను పొందుపరచాలని అన్నారు. డాక్యుమెంటరీ సపోర్టుగా ప్రతి అంశాన్ని విధిగా జత చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా భూ పరిశీలనకు జాయింట్ టీంలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ మాట్లాడుతూ 8,352.69 చదరపు కిలో మీటర్ల పరిధిలో సి.ఆర్.డి.ఏ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో సి.ఆర్.డి.ఏ చట్టం ప్రకారం భూ సేకరణ ప్రక్రియ ఇతర అంశాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూమి, బంజరు, ఇనాం, దేవాదాయ, నీటిపారుదల తదితర భూముల కేటగిరీ వారీగా కార్యాచరణ ప్రణాళికలు అవసరం అని వివరించారు. ఈ సమన్వయ సమావేశంలో గుంటూరు, పల్నాడు జాయింట్ కలెక్టర్ లు అశుతోష్ శ్రీవాస్తవ, సంజనా సింహా, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి ఇన్ ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, సి.ఆర్.డి.ఏ భూ సేకరణ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review