జలధార – జలహారతి కార్యక్రమంలో ఫీడర్ కాలువుల పునరుద్ధరణ ప్రధానమని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శివప్రసాద్ అన్నారు. జలధార – జలహారతి అవగాహన, శిక్షణ కార్యక్రమం ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జలవనరుల శాఖ ఇంజనీర్లు, నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సోమవారం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం జలధార – జలహారతి ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు వంద రోజుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. సరయిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సరయిన పనులు చేపట్టాలని సూచించారు. సమగ్రమైన పనులు నాణ్యతతో చేపట్టాల్సి ఉందని చెప్పారు. ప్రాణికోటికి నీరు అవసరం అన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో 38 వేల చెరువులు ఉన్నాయని, వీటితో పాటు ఇంకా అనేక జలవనరుల ప్రదేశాలు ఉంటాయని చెప్పారు. 14 వేల ఆరు వందల చెరువులను పూర్తి స్థాయిలో నింపగలుగుతున్నామని తెలిపారు. 3,300 చెరువులకు నీరు రావడం లేదని, 4,600 చెరువులలో 25 శాతం మాత్రమే నిండుతున్నాయని వివరించారు. చెరువులకు వచ్చే కాలువలు వివిధ కారణాల వలన ప్రక్కకు మళ్ళించి ఉండవచ్చని, వాటిని గుర్తించి తిరిగి యథా స్థితికి తీసుకురావాలని చెప్పారు. 6.80 లక్షల జల సంరక్షణ పనులను జల వనరుల శాఖ గుర్తించిందన్నారు. మరమ్మతులు మాత్రమే కాకుండా కొత్త పనులు కూడా చేపట్టవచ్చని తెలిపారు. పచ్చదనం పెంచే పనులు చేయవచ్చని పేర్కొన్నారు. ఫీడర్ కాలువులు సక్రమంగా పారుటకు నిర్మాణాల నాణ్యతలో పక్కాగా ఉండాలని చెప్పారు. అన్ని చిన్న నీటిమడుగుల పునరుద్ధరణ, ఫీడర్ కాలువల మరమ్మత్తులు, నీటి వనరుల అనుసంధానం, వరద నీటి వినియోగం మట్టి మరియు నీటి సంరక్షణ పనులు, రిడ్జ్ టు వ్యాలీ పద్ధతి అమలు, పచ్చదనం పెంపు, కొత్త నీటి నిల్వ నిర్మాణాలు, టెక్నాలజీ వినియోగం, చెరువుల ఫీడర్ ఛానల్స్ శుభ్రపరచడం, గట్లను బలోపేతం చేయడం, చెరువులను సమీపంలోని కాలువలు లేదా వాగులతో అనుసంధానించడం, మొక్కల పెంపకం, కొత్త నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటు, గ్రామ నీటి బడ్జెట్ తయారీ తదితర అంశాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్ మాట్లాడుతూ జలధార – జలహారతి పనుల గుర్తింపు, మంజూరు, అమలు చేయాలన్నారు. జల వనరులను పరిరక్షించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. భూగర్భ జలాలు పెంచాలని, గొలుసుకట్టు చెరువులను నింపాలని అన్నారు. ఉపాధి హామీ అనుసంధానంతో పనులు చేపట్టాలని నిర్దేశించడం జరిగిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేటట్లు చూడాలని అన్నారు. వర్షాకాలం తరువాత కూడా భూగర్భ జలాలు మూడు మీటర్లు మేర ఉండాలనేది ఆశయం అన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు మాట్లాడుతూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. నీటి కొరత ఉన్న గ్రామాలు గుర్తించి అటువంటి చోట పనులు చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు వందనం మాట్లాడుతూ నీరు ప్రాణాధారం అన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవాలని చెప్పారు. ప్రతి కుటుంబం ఏడాదికి సరాసరిన రెండు లక్షల లీటర్లు వినియోగిస్తుందని, అయితే కనీసం పది వేల లీటర్లు భూమిలోకి పంపించే చర్యలు చేపట్టడం లేదన్నారు. గుంటూరు జిల్లాలో 40 గ్రామాల్లో 6 మీటర్ల కంటే లోతులో ఉందన్నారు. ఆ గ్రామాలపై దృష్టి సారించాలని కోరారు. జిల్లాలో 37 పీజియో మీటర్లు, 29 అబ్జర్వేషన్ వెల్స్ ఉన్నాయని, తద్వారా భూగర్భ జలాల పరిశీలన చేస్తున్నామని అన్నారు. చేబ్రోలు మండలం చేకూరు గ్రామంలో మాత్రమే 11.37 మీటర్ల మేర జలాలు అందుబాటులో ఉందని చెప్పారు. ఐదు మండలాల్లో ఆరు మీటర్ల కంటే లోతులో నీరు లభ్యం అవుతుందని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో చెరువుల పూడికలు తీయడం, గట్లను బలోపేతం చేయడంతో భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, బాపట్ల జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, పల్నాడు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం. సిద్ధలింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.



