న్యూ ఢిల్లీ: నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలు, కొత్త ప్రాజెక్టుల అవశ్యకతను వివరిస్తూ మూడు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాలను మంత్రికి అందజేశారు.
1. రామాయపట్నం పోర్టుకు రైల్వే అనుసంధానం
పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి, మరియు వ్యవసాయ రంగాల అభివృద్ధికి పిడుగురాళ్ల – రామాయపట్నం పోర్ట్ మధ్య నూతన రైల్వే లైన్ అత్యంత కీలకమని ఎంపీ వివరించారు.
- ప్రయోజనం: ఈ లైన్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ రవాణా సులభతరమవుతుందని, రవాణా ఖర్చులు తగ్గి స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రికి తెలియజేశారు.
2. విజయవాడ – బెంగళూరు ‘వందే భారత్’
ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల సౌకర్యార్థం విజయవాడ – బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించాలని ఎంపీ కోరారు. పల్నాడు జిల్లా నుండి నిత్యం వేలాది మంది బెంగళూరుకు ప్రయాణిస్తున్నారని, వేగవంతమైన ప్రయాణం కోసం ఈ రైలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
3. కీలక స్టేషన్లలో రైళ్ల నిలుపుదల
ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన రైళ్లకు స్టాపేజ్ కల్పించాలని ఎంపీ విన్నవించారు:
- సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ (20701)
- లింగంపల్లి – విజయవాడ ఎక్స్ప్రెస్ (12796) పై రెండు రైళ్లను నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి సానుకూల స్పందన: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పల్నాడు ప్రాంత రైల్వే అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, ఈ విజ్ఞప్తులపై త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.



