జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి బుధవారం జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు సేకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు, వినతులను డీఆర్ఓ దృష్టికి తీసుకురాగా, వాటిని సమగ్రంగా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. పరిపాలనా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు ఉద్యోగ సంఘాల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.



