GUNTUR DISTRICT NEWS: గ్రామాల వారీ పంట ప్రణాళిక అవసరం

Karthik

గ్రామాల వారీ పంట ప్రణాళిక అవసరమని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలాల వారిగా, గ్రామాలలో పంటల విధానం, ఆచరణీయ విధానం పక్కాగా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామంను తయారు చేయాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.1.20 లక్షల మంది రైతులు, 30 వేల కౌలు రైతులు జిల్లాలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయగా వారందరికీ సమాచారం అందించుటకు తగిన కమ్యూనికేషన్ విధానం ఉండాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం యూ ట్యూబ్ చానల్ ఒక దానిని నెలకొల్పి మండలాల వారిగా రైతులకు నిరంతరం అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట పొలాల్లో రైతులు గడ్డి కాల్చకుండా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహనకు మంచి ప్రదర్శన శాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కనీసం 10 వేల మందితో ప్రతి నియోజక వర్గంలో మూడు రోజుల పాటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత కంపెనీల ప్రతినిధులు వచ్చి ప్రదర్శించాలని సూచించారు. పంటలపై పెట్టుబడులు తగ్గాలని అన్నారు. పొలం, పొలం గట్లపైన పంటలు వేసే విధానం., ఒక సీజన్ లో బహుళ రకాల పంటలు సాగు చేసే అవకాశం పరిశీలించాలని, రైతుకు ఆదాయం రావాలని అన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయాన్ని ఒక మోడల్ గా చేయుటకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మార్కెట్ లాభదాయకత ఉండే పంటలు రైతులకు సూచించాలన్నారు. భూసార పరీక్షలు వలన ఏ పంటలు వేయాలో సూచించాలని చెప్పారు. స్వల్పకాలిక పంటలకు రైతులు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ రైతులు క్రమ క్రమంగా పంటల మార్పిడికి చర్యలు చేపట్టడం ఉత్తమమని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్పష్టమైన ప్రణాళిక, పంటల క్యాలండర్ రూపొందించాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మరియు వ్యవసాయ శాస్త్రవేత్త డా. పి.వి.సత్య నారాయణ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు తట్టుకుని నిలబడే వ్యవసాయ విధానాలు అవసరం అన్నారు. రైతు సుస్థిరతకు స్వీయ విత్తన విధానం తీసుకురావలసిన అవసరం ఉందని వివరించారు. తద్వారా సమయానుకూలంగా విత్తనాలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. పంటల మార్పిడి అవలంభించాలని తెలిపారు. పచ్చి రొట్ట విత్తనాలు అందించాలని తద్వారా భూసారం పెరుగుతుందని అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో 40 వేల ఎకరాలలో పంట మార్పిడికి అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రోన్ల వినియోగం వలన పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి మాట్లాడుతూ 1,667 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు జిల్లాకు సరఫరా అయిందన్నారు. 1,830 భూసార పరీక్షలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. ఈ సమావేశంలో తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు,పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review