GUNTUR CITY NEWS: ప్లాస్టిక్ రహిత గుంటూరు లక్ష్యంగా సమష్టి కృషి

Karthik

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పిలుపుమానవాళి ఆరోగ్యానికి, పర్యావరణ సమతౌల్యానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం “ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రం“ థీమ్ మేరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిఎంసి ప్రధాన కార్యాలయం నుండి పట్నం బజార్ వరకు అవగాహన ర్యాలీ, అనంతరం ప్లాస్టిక్ ఫ్రీ సిటిప్రతిజ్ఞ నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా సహకరిస్తేనే ప్లాస్టిక్ రహిత నగర లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్ర హానికరమని తెలిపారు. ప్లాస్టిక్ పూర్తిగా డీకంపోజ్ కావడానికి వందల సంవత్సరాలు పడుతుందని, దాని వలన నేల, నీరు, గాలి కాలుష్యం పెరుగుతోందన్నారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల పారిశుధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు వార్డ్ సచివాలయాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటింటికీ ప్రచారం చేపట్టి, ప్రజలను ప్లాస్టిక్ వినియోగం నుంచి దూరం చేసే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలకు సులభంగా గుడ్డ సంచులు అందుబాటులో ఉండేలా జిఎంసి ఆధ్వర్యంలో క్లాత్ వెండింగ్ మెషీన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, కాగితం సంచులు, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణ హితంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి స్వచ్ఛమైన భవిష్యత్తుకు సహకరించాలని కోరారు.అనంతరం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నగరంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, డ్రోన్ల ద్వారా యాంటీ లార్వ చర్యలు, ఫాగింగ్, నిల్వ నీటిని తొలగించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వార్డు స్థాయిలో ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టి దోమల పెరుగుదలకు కారణమయ్యే పరిస్థితులను గుర్తించి తక్షణ నివారణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ ఏడాది డెంగ్యూ దినోత్సవం “తనిఖీ చేయండి–శుభ్రపరచండి–మూతపెట్టండి” (Check–Clean–Cover) అనే థీమ్‌తో నిర్వహించబడుతుందన్నారు.కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయాలజిస్ట్ శేషయ్య, మేనేజర్ బాలాజీ బాష,ఉపా సెల్ పిఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review